నవతెలంగాణ-సిద్దిపేట : సెప్టెంబర్ 30 ,అక్టోబర్ 1, 2 రోజున మానవియ విలువలు అంశంపై చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాలను సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వినిపించనున్నట్లు సిద్దిపేట ఉత్సవ కమిటీ నిర్వాహక అధ్యక్షులు నందిని శ్రీనివాస్ తెలిపారు. చాగంటి ప్రవచనాల పోస్టర్ ను సిద్దిపేట ఉత్సవ కమిటీ రామరాజ ట్రస్ట్ భవనంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంప శ్రీనివాస్, కృష్ణమాచార్యులు, నందిని శ్రీనివాసులు మాట్లాడుతూ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సిద్దిపేటను అన్ని రంగాలలో రాష్ట్రంలో ముందు ఉంచారని , ఆధ్యాత్మిక రంగంలో కూడా ముందు ఉంచాలని, మానవీయ విలువలను సమాజానికి అందించాలనే ఉద్దేశంతో చాగంటి కోటేశ్వరరావును ఒప్పించి మూడు రోజులపాటు ప్రవచనాలను మంత్రి ఇప్పిస్తున్నారని తెలిపారు. నేటి సమాజంలో, టెక్నాలజీ పై ఆధారపడి బ్రతుకుతున్న యువతకు, ఈ హైటెక్ యుగంలో మానవీయ విలువలను తెలుపాలని ఉద్దేశంతో మూడు రోజుల పాటు ప్రవచనాలను ఇప్పిస్తున్నారని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుండి 8:30 గంటల వరకు చాగంటి వారి ప్రవచనాలు ఉంటాయని, అంతంకు ముందు నాలుగున్నర గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రవచనాల అనంతరం ప్రసాదంతో పాటు, అల్పాహారం ఉంటుందని తెలిపారు. సుమారు 20వేల మంది ప్రవచనాలను వినడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని, వారందరికీ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కొర్తివాడ లక్ష్మణ్, మధుసూదన్, అంజయ్య, శ్రీకాంత్, పోశెట్టి శ్రీకాంత్, అనిల్, శ్రీనివాస్, రాజు, బచ్చు రమేష్, శరభయ్య, అయిత నాగరాజు, శ్రీనివాస్, రాములు, వీరేశం తదితరులు పాల్గొన్నారు.