నవతెలంగాణ – సత్తెనపల్లి: ఏపీఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి తిరుమలకు చేరుకునే వారికి అందించే దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచింది. మొన్నటివరకు రోజూ ఆర్టీసీ ప్రయాణికులకు రాష్ట్రవ్యాప్తంగా 600 టికెట్లు ఇస్తుండగా తాజాగా ఆ సంఖ్యను 1000కు పెంచింది. బస్సు ఛార్జీకి తోడు శ్రీవారి దర్శనానికి రూ.300 దర్శన టికెట్ను ప్రయాణికులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బుక్ చేసుకునే టికెట్లు ఈ నెల 15 నుంచి అక్టోబరు 7వ తేదీలోపు ప్రయాణం, దర్శనానికి ఉపయోగపడతాయి. అధికారిక వెబ్సైట్ www.apsrtconline.in లో అదనపు కోటా టికెట్ల బుకింగ్ మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని పల్నాడు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి ఎన్.వి.శ్రీనివాసరావు ‘న్యూస్టుడే’తో చెప్పారు.