– అసెంబ్లీలో సీఎం ప్రకటన
– ధరణికి ‘భూమాత’గా పేరు మార్పు
– గ్రేటర్లోకి మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, గ్రామాలు
– శ్రీధర్బాబు నేతృత్వంలో సబ్కమిటీ
– కొత్త రేషన్కార్డుల జారీకి ఓకే
– ఉత్తమ్ పర్యవేక్షణలో ఉపసంఘం
– సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు
– ఆరోగ్యశ్రీ, రేషన్కార్డులకు విడివిడిగా కార్డుల జారీ
– గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం,అమీర్ అలీ
– మళ్లీ గవర్నర్కు ప్రతిపాదన
– క్రీడాకారులకు ఇండ్లస్థలాలు, ఉద్యోగాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం అసెంబ్లీలో మంత్రివర్గం ఆయా సమస్యలు, ప్రతిపాదనలపై గంటన్నరపాటు చర్చించింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన సమావేశం ఐదున్నర గంటలకు ముగిసింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.
1. కేరళలోని వయనాడ్లో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. ఈ విషాదంపై తెలంగాణ క్యాబనెట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలందించేందుకు నిర్ణయం చేసింది.
2. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. శుక్రవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ను ప్రకటిస్తారు.
3. రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్తో హెల్త్ కార్డులను జారీ చేసేందుకు క్యాబినెట్ చర్చించింది. దీనికి సంబంధిం చిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ సభ్యులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చైర్మెన్గా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులను విడివిడిగా ఇవ్వాలని క్యాబినెట్ తీర్మానం చేసింది.
4. క్రీడాకారిణి ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్లో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్కు, సిరాజ్కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది.
5. విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరిరతన్కు మున్సిపల్ కమిషనర్(గ్రూప్-1) ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది.
6 ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అదనపు డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
7. మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ నియోజకవర్గం హుస్నాబాద్లోని గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.437 కోట్లను విడుదల చేసింది.
8.ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి క్యాబినెట్ చర్చించింది. కోదండరాం, అమేర్ అలీ ఖాన్ ల పేర్లను తిరిగి కొత్త గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది.
9 నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని భావించింది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించింది.
10. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటితో శామీర్పేట చెర్వు నింపి, అక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి, అందులో 10 టీఎంసీలతో చెర్వులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
11. ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది. రైతు భరోసా అమలుకు విధివిధానాలు ఖరారు చేసినట్టు సమాచారం.
12. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోకి ఔటర్ గ్రామాలు, శివారు మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల విలీనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు డి. శ్రీధర్బాబు అధ్యక్షతన ధనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్ సభ్యులుగా ఉపసంఘాన్ని నియమించింది. న