నవతెలంగాణ – హైదరాబాద్ : టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్-2023 ప్రవేశ పరీక్షలను ఈ నెల 25న నిర్వహించనున్నట్లు టీఎస్ లాసెట్ కన్వీనర్ వెల్లడించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. మూడేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థులకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ను ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్ను మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు నిర్వహించనున్నారు. ఐదేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థులకు మూడో సెషన్లో సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. మొదటి, రెండో సెషన్లకు తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్లో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడో సెషన్కు తెలంగాణలో 41, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. లాసెట్, పీజీ ఎల్సెట్కు 43,692 మంది హాజరు కానున్నారు. మూడేండ్ల లా డిగ్రీ కోర్సుకు 31,485 మంది, ఐదేండ్ల లా డిగ్రీ కోర్సులకు 8,858 మంది, ఎల్ఎల్ఎంకు 3,349 మంది దరఖాస్తు చేసుకున్నారు. హాల్ టికెట్లో పొందుపరిచిన అంశాలను ప్రతి అభ్యర్థి పరిగణనలోకి తీసుకోవాలని కన్వీనర్ సూచించారు.