నవతెలంగాణ – విజయవాడ: ఢిల్లీలోని యుఎఇ రాయబార కార్యాలయం, యుఎఇ-ఇండియా సిఇపిఎ కౌన్సిల్ (యుఐసిసి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆర్థిక, పెట్టుబడుల రౌండ్టేబుల్ సమావేశంను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని యుఎఇ రాయబారి హిజ్ ఎక్సలెన్సీ (హెచ్.ఇ.) అబ్దుల్నాసర్ అల్షాలీ పిహెచ్.డి మరియు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టిజి భరత్ హాజరయ్యారు. ఈ రౌండ్టేబుల్ కార్యక్రమంలో యుఎఇ నుంచి పాల్గొన్నవారిలో యుఐసిసి డైరెక్టర్ అహ్మద్ అల్జ్నేఇబి, అలాగే యుఎఇ కంపెనీలు, అబుదాబి పోర్ట్స్, ఎయిర్ అరేబియా, అరామేక్స్ , డిపి వరల్డ్, డ్యూకాబ్ , ఎమ్మార్ , ఎమిరేట్స్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్ ఎన్ బి డి, ఫ్లై దుబాయ్, ది లులు గ్రూప్, తబ్రీద్ సంస్థల ప్రతినిధులు వున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి 50 మంది సీనియర్ ప్రభుత్వ అధికారులు, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సందర్భంగా హెచ్.ఇ. డాక్టర్ అల్షాలీ మాట్లాడుతూ.. యుఎఇ -ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ కీలకమైనది. ప్రజల మధ్య, ఆర్థిక పెట్టుబడి భాగస్వామ్యాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలను చేయవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. “యుఎఇ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్థిక, పెట్టుబడి సహకార స్థాయిని పెంచడం చాలా అవసరం. ఈ రౌండ్టేబుల్లో 10 కంటే ఎక్కువ ప్రధాన యుఎఇ కంపెనీలు పాల్గొనడం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాముఖ్యతను మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక పెట్టుబడులు, అభివృద్ధి అజెండాలకు మద్దతు ఇవ్వడానికి యుఎఇ యొక్క సుముఖతను బలంగా ధృవీకరిస్తుంది” అని అన్నారు.ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచడానికి మరియు ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడానికి, యుఎఇ, ఆంధ్రప్రదేశ్ మధ్య విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం చాలా కీలకమని రాయబారి వెల్లడించారు. యుఎఇ క్యారియర్లు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి వారానికి 35 డైరెక్ట్ విమానాలను ప్రారంభించవచ్చని, ఇది ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలకు సంవత్సరానికి 500,000 మంది ప్రయాణికులను పెంచడానికి వీలు కల్పిస్తుందని గుర్తించటం జరిగింది. యుఎఇ, ఆంధ్రప్రదేశ్ల మధ్య ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినియోగదారుల ఎంపిక, ఆర్ధిక అవకాశాలు పెరగడమే కాకుండా, కీలకమైన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ విమానయాన కేంద్రంగా రాష్ట్ర స్థానాన్ని మెరుగుపరుస్తుందన్నారు.
యుఐసిసి డైరెక్టర్ శ్రీ అల్జ్నేఇబి మాట్లాడుతూ.. యుఎఇ – ఇండియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఈపిఏ) యొక్క లక్ష్యాలను సమావేశంలో పాల్గొన్నవారికి వివరించారు. ఈ ఒప్పందం పై ఆధారపడటమే కాకుండా, యుఎఇ లో తమ పెట్టుబడి కార్యకలాపాలను విస్తరించేందుకు ఇతర ఇటీవలి ద్వైపాక్షిక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ వ్యాపార సంఘం వినియోగించుకోవడంలో వారి సామర్థ్యాన్ని కూడా వెల్లడించారు.
రౌండ్ టేబుల్ సందర్భంగా, పలు యుఎఇ కంపెనీలు ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో తమ పెట్టుబడి ప్రణాళికలను మరింత విస్తృతంగా వివరించాయి. వ్యవసాయం మరియు ఫుడ్ ప్రాసెసింగ్, ఏవియేషన్ మరియు ఏరోస్పేస్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి, ఆటోమోటివ్లు, పెట్రోలియం, పెట్రోకెమికల్స్, షిప్పింగ్, లాజిస్టిక్స్ మరియు పోర్ట్లతో సహా అనేక రంగాలలో సహకారం గురించి రెండు వైపుల ప్రతినిధుల నడుమ చక్కటి చర్చ జరిగింది. .
ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసే అవకాశం కూడా హెచ్.ఈ. డాక్టర్ అల్షాలీకి లభించింది. చర్చల సమయంలో, హెచ్.ఈ. డాక్టర్ అల్షాలీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులైన నాయుడుని అభినందించారు. ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని కోణాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో స్పష్టమైన భాగస్వామ్యం విస్తరించాలనే యుఎఇ ప్రభుత్వ కోరికను వెల్లడించారు.
2023-2024 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వాణిజ్యం యుఎస్డీ 1.46 బిలియన్లకు చేరుకోవడంతో భారతదేశంలోని 28 రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో యుఎఇ యొక్క 11వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇదే కాలంలో, యుఎఇ ఇండియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 83.64 బిలియన్లుగా ఉంది. భారతదేశం యొక్క రెండవ-అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా, మూడవ-అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మరియు నాల్గవ-అతిపెద్ద పెట్టుబడిదారుగా యుఎఇ నిలిచింది .