నవతెలంగాణ-హైదరాబాద్ : సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన వేళ తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ మీడియాతో మరోసారి స్పందించారు. తాను కుల భేదాలు నశించాలని అన్నానని, కేవలం హిందుత్వలోనే కాకుండా అన్ని మతాల్లోనూ ఈ భేదాలు పోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘నిన్నటి కార్యక్రమంలో తాను ఏదైతే చెప్పానో.. దాన్నే మళ్లీ చెప్తున్నా. కులం అనేది నశించాలి. అది ఏ మతంలో ఉన్నా..’’ అని స్టాలిన్ అన్నారు. ‘‘ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోంది. దాన్నుంచి దృష్టి మరల్చడానికే ఇవన్నీ చేస్తోంది. ప్రధాని మోడీ పదే పదే ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటూ ఉంటారని, అంటే కాంగ్రెస్ను చంపేయమని అర్థమా?’’ అని ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. తనపై ఎలాంటి కేసులు పెట్టినా భయపడబోనన్నారు.