గ్రీస్‌ వర్సిటీ ఎన్నికల్లో కమ్యూనిస్టు మద్దతుదారుల జయభేరి

ఏథెన్స్‌ : గ్రీస్‌లోని 266 యూనివర్సిటీలలో ఈ నెల 10న జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టుల మద్దతుతో పోటీ చేసిన విద్యార్థి సంఘం పాన్స్‌పౌడస్టికీ కేఎస్‌ జయభేరి మోగించింది. ఈ విద్యార్థి సంఘం వర్సిటీ ఎన్నికలలో జయకేతనం ఎగరేయడం ఇది వరుసగా రెండోసారి. ఈ సంఘానికి 19,632 ఓట్లు లభించాయి. పోలైన ఓట్లలో పాన్స్‌పౌడస్టికీ కేఎస్‌కు 35.04% ఓట్లు వచ్చాయి. గ్రీస్‌లో అధికారంలో ఉన్న న్యూ డెమొక్రసీ పార్టీ బలపరచిన డీఏపీ-ఎన్‌డీకేఎఫ్‌కు 14,441 ఓట్లు (25.77%) మాత్రమే వచ్చాయి. సోషల్‌ డెమొక్రటిక్‌ పీఏఎస్‌పీ మద్దతు ఇచ్చిన పీఏఎస్‌ఓకే 5,299 (9.46%) ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ విజయం నేపథ్యంలో పాన్స్‌పౌడస్టికీ కేఎస్‌, కమ్యూనిస్ట్‌ యూత్‌ ఆఫ్‌ గ్రీస్‌ (కేఎన్‌ఈ)లు ఏథెన్స్‌ పాలిటెక్నిక్‌ సహా పలు ప్రాంతాలలో విజయోత్సవాలు జరుపుకున్నాయి. పాన్స్‌పౌడస్టికీ కేఎస్‌ సంఘాన్ని 1974లో గ్రీస్‌ ఉన్నత విద్యా సంస్థలలో ఏర్పాటుచేశారు. దీనికి కమ్యూనిస్టులు మద్దతుగా నిలిచారు. ఉచిత-సార్వత్రిక విద్యను అందించడం, విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాడడం, విద్యార్థి హక్కులను పరిరక్షించడం దీని అజెండాలోని కీలక అంశాలు. యూనివర్సిటీ క్యాంపస్‌లలో అసమ్మతిని అణచివేసేందుకు పోలీసు నిఘాను, గస్తీని పెంచాలన్న ప్రభుత్వ యోచనను వ్యతిరేకిస్తూ విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. వీటిలో పాన్స్‌పౌడస్టికీ కేఎస్‌ భాగస్వామి అయింది. కోవిడ్‌ సమయంలో కూడా విద్యార్థులు, యువత భవిష్యత్తు కోసం కృషి చేసింది. తమ హక్కులపై జరిగే దాడులను విద్యార్థులు ప్రతిఘటిస్తారని చెప్పడానికి ప్రస్తుత, రాబోయే ప్రభుత్వాలకు ఈ విజయం ఓ హెచ్చరిక వంటిదని కేఎన్‌ఈ కార్యదర్శి థొడోరిస్‌ కాట్సాండిస్‌ వ్యాఖ్యానించారు.

Spread the love