కులగణన తర్వాతే కేంద్రంపై యుద్ధం

CM Revanth Reddy's call in caste awareness conference– తెలంగాణ నుంచే మొదలు
– నవంబర్‌ 30లోపు పూర్తి
– ఎక్స్‌రే మాత్రమే కాదు… మెగాహెల్త్‌ చెకప్‌
– గాంధీ కుటుంబం మాట అంటే మాటే
– ఇది నాకు పార్టీ ఇచ్చిన గుర్తింపే…
– పార్టీకి నష్టం చేకూరేలా మాట్లాడితే సహించం
– ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి : కులగణన అవగాహన సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఆర్థిక అసమానతలు, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. నవంబర్‌ 30లోగా కులగణన పూర్తి చేసి ప్రధాని నరేంద్రమోడీపై భవిష్యత్‌ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అది తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలు అవుతుందన్నారు. కులగణన ఎక్స్‌రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్‌ చెకప్‌ లాంటిదని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్‌ విధానమని స్పష్టం చేశారు. గాంధీ కుటుంబం మాట ఇచ్చిదంటే అది శిలాశాసనమని చెప్పారు. మాట అంటే మాటే అన్నారు. ఆ కుటుంబం ఇచ్చిన మాట ప్రకారం కుల గణనను చేపడుతున్నట్టు తెలిపారు. ఆ చర్చకు తావు ఇచ్చారంటే పార్టీ ద్రోహులేనన్నారు. వ్యక్తిగతంగా తనకు గుర్తింపులేదనీ, కాంగ్రెస్‌ పార్టీ ద్వారా తనకు ఈ గుర్తింపు వచ్చిందని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలు, అమలు విషయంలో చర్చకు తావులేకుండా చూడాలని చెప్పారు. పార్టీకి నష్టం చేకూరేలా మాట్లాడితే సహించబోమని చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షలు మహేష్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన కులగణనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో తెలంగాణ మోడల్‌ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్‌ డాక్యుమెంట్‌ను కేంద్రానికి పంపుతామన్నారు.
పార్టీతోనే తనకు గుర్తింపు
కాంగ్రెస్‌ పార్టీనే తనకు గుర్తింపు ఇచ్చిందనీ, మీరంతా కష్టపడితేనే ఈ బాధ్యత వచ్చిందని రేవంత్‌ చెప్పారు. పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానమన్నారు. రేవంత్‌రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప… వ్యక్తిగత ఎజెండాతో పని చేయడని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందనీ, సామాజిక, ఆర్ధిక రాజకీయ కులగణన చేస్తామని సెప్టెంబర్‌ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో సోనియమ్మ సఫలీకృతమయ్యారని తెలిపారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నెరవేర్చారని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డొచ్చినా అది నెరవేర్చి తీరుతుందన్నారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టడం ఇక్కడున్న ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. రేవంత్‌రెడ్డినా, మహేష్‌కుమార్‌ గౌడా అనేది ముఖ్యం కాదనీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులమని స్పష్టం చేశారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్‌ను బీసీ కమిషన్‌ చైర్మెన్‌గా నియమించుకున్నామని తెలిపారు. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా… ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని దిశానిర్దేశం చేశారు. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది పర్యవేక్షకులను నియమించాలని పార్టీకి సూచించారు.
బాధ్యతగా పని చేయండి
‘బాధ్యతగా పని చేయండి. మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది’ రేవంత్‌ అన్నారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించబోదని హెచ్చరించారు. దేశానికి తెలంగాణ ఒక మోడల్‌గా మారాలనీ, ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ మోడల్‌ దేశంలో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలను ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించాయని తెలపారు. రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా పదినెలల్లో 50వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు.
గ్రూప్‌ 1పై ప్రతిపక్షాలు అపోహలు సృష్టించాయి
గ్రూప్‌ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్టించి అడ్డుకోవాలని ప్రయత్నించారని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జీవో ఇచ్చినపుడు, నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్‌ ఫలితాలు ఇచ్చినపుడు కోర్టుకు పోలేదన్నారు.
కానీ మెయిన్స్‌ నిర్వహించే సందర్భంలో జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్‌ను కొట్టేసిందన్నారు. కొంతమంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్‌ 1 నిర్వహిస్తున్నారనీ, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక వాదన తీసుకొచ్చారని తెలిపారు. సెలక్ట్‌ అయిన 31,383 మందిలో 10శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారనీ, 57.11 శాతం బీసీలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్‌ కోటాలో సెలక్ట్‌ అయ్యారని తెలిపారు. స్పోర్ట్స్‌ కోటాలో 20 మంది సెలక్ట్‌ అయ్యారని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
సోషల్‌ ఎకనామిక్‌ సర్వే పేదలకు ‘చేయూత’ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
సోషల్‌ ఎకనామిక్‌ సర్వే ద్వారా ఆర్థికంగా వెనకబడిన పేదలకు ‘చేయూత’ అందిస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. కులగణనతో ఇంకా వెనకబడిన వర్గాలకు ఏం చేయోచ్చని అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. అన్ని జిల్లాల్ల డీసీసీ అధ్యక్షులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలకు అతీతంగా ఒక మీటింగ్‌ ఏర్పాటు చేస్తామనీ, వచ్చే నెల 5న రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు. దేశం మొత్తానికి తెలంగాణ కులగణన ఎక్స్‌ రేలా పని చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న కులగణన పై చర్చ జరగకుండా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపలి కృష్ణారావు, సీనియర్‌ నేతలు కే కేశవరావు, వి.హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love