నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటి తీవ్రంగా ఖండిస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ తెలియజేశారు. శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యాలయంపై కార్యకర్తలు దాడి చేయడానికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఖండిస్తూ, మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ సహజమని ఆయా సందర్భాలలో పాలకులు చేస్తున్న పనులపైన విమర్శలు చేస్తుంటారని, ఆ సందర్భంలో ఏమన్నా తప్పు పదాలు మాట్లాడితే తప్పును ఎత్తి చూపేలా ఉండాలి కానీ దాడులు చేసి గాయపరిచేలా ఉండకూడదని సూచించారు. రాజ్యాంగంలోని హక్కులను అందరు గౌరవించాలని భౌతిక దాడులకు పూనుకోవడం సమంజసం కాదని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సహనం, సమన్వయం కోల్పోతే ప్రజలకు దూరం అవుతుందని తెలియజేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఈరోజు జరిగిన ఈ ఘటన విషయములో పోలీసులు నిస్పక్ష పాతంగా వ్యవహరించాలని జహంగీర్ కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు లు పాల్గొన్నారు.