వాట్సాప్‌ అదుర్స్‌

వాట్సాప్‌ నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌ యూజర్లు పండగ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న దిగ్గజ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. తాజాగా కొత్త ఫీచర్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
వాట్సాప్‌ వినియోగదారులు ఇప్పుడు పీసీలో ఏకంగా గరిష్టంగా 32 మందితో ఒకేసారి వీడియో కాల్స్‌ చేసుకోవచ్చుననే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
32 మంది పార్టిసిపెంట్స్‌తో బీటాలో వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇక మీదట గూగుల్‌ మీట్‌, జూమ్‌ లాంటి వాటి అవసరం లేకుండానే ఒకేసారి 32 మందితో వీడియో కాల్‌లో డెస్క్‌టాప్‌ ద్వారా మీటింగ్‌కు ఏర్పాటు చేసుకోవచ్చునని వాబీటా ఇన్ఫో ప్రకటించింది.
ఈ సదుపాయం ప్రస్తుతానికి కొత్త వాట్సాప్‌ బీటా ఇన్‌స్టాల్‌ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో దీనిని యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అన్నీ పనులు పూర్తవుతాయని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.
‘సైలెన్స్‌ అన్‌నోన్‌’ కాలర్స్‌…
సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్పామ్‌ కాల్స్‌ పెరిగిపోయాయి. వీటిపై పలు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు కూడా పదేపదే హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను అడ్డుకునేందుకు వాట్సాప్‌ కొత్తగా ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని పేరు ”సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌”. స్మార్ట్‌ ఫోన్‌ కలిగిన యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలంటే.. వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కిందకు స్క్రోల్‌ చేస్తే ప్రైవసీ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే వచ్చే జాబితాలో కాల్స్‌ పై క్లిక్‌ చేయాలి. అక్కడ సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని అనేబుల్‌ చేస్తే సరిపోతుంది. మీ కాంటాక్ట్‌ లిస్టులో లేని, గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చినా మీకు వినిపించదు. ఓ మిస్డ్‌ కాల్‌ వచ్చినట్టుగా చూపిస్తుంది. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ స్పామ్‌, స్కాం కాల్స్‌ను ముందే గుర్తిస్తుంది. వాట్సాప్‌ పాత వెర్షన్‌ ఉపయోగిస్తున్నవారు వాట్సాప్‌ను అప్‌?డేట్‌ చేసుకుంటేనే ఈ ”సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌” ఆప్షన్‌ కనిపిస్తుంది.

Spread the love