నవతెలంగాణ-హైదరాబాద్ : నీట్ పరీక్షల్లో అక్రమాలపై మోడీ లక్ష్యంగా ఆప్ విమర్శలు గుప్పించింది. దేశంలో ఎక్కడైనా ప్రశ్నా పత్రాలు లీకయితే నిందితులను కఠినంగా శిక్షించేలా గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ డిమాండ్ చేశారు. కాషాయ సర్కార్ పనితనానికి నీట్ తాజా ఉదాహరణని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కొలువుతీరినా అక్కడ ప్రశ్నాపత్రాల లీకేజ్ సర్వసాధారణమైందని వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజ్లకు గుజరాత్ ప్రధాన కేంద్రంగా మారిందని దుయ్యబట్టారు. నీట్ చిన్న పరీక్ష కాదని, పేపర్ లీకేజ్ విషయంలో ప్రధాన సూత్రధారి వెనుక శక్తివంతమైన వ్యక్తులు ఉండి ఉంటారని ఆయన పేర్కొన్నారు. నీట్ పరీక్షల అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని సందీప్ పాఠక్ డిమాండ్ చేశారు.