నవతెలంగాణ – న్యూఢిల్లీ : ‘ఢిల్లీలో బాణాసంచాపై శాశ్వతంగా నిషేధం ఎందుకు విధించకూడదు’ అని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిషేధం ఉన్నప్పటికీ.. దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడంతో ఢిల్లీలో వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిందన్న నిపుణుల కమిటీ నివేదికను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ నివేదికపై ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ కమిషనర్ స్పందన కోరింది. వారంరోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని, నవంబర్ 14న తిరిగి విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. బాణా సంచా కాల్చడంపై ‘శాశ్వత నిషేధం’ జారీచేయడంపై ఢిల్లీ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఢిల్లీలో 2025 జనవరి 1 వరకు అన్ని రకాల బాణాసంచా తయారీ, నిల్వ చేయడం, విక్రయాలు, ఆన్లైన్ ద్వారా పంపిణీ, కాల్చడంపై ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డిపిసిసి) నిషేధం విధించిన ఉత్తర్వులను కూడా కోర్టు పరిశీలించింది.