ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్.ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించగా, ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు.
ఈనెల 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఘన విజయాన్ని సాధించడంతో చిత్రయూనిట్ శుక్రవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వీ రాఘవ్ మీడియాతో మాట్లాడుతూ, ‘నేను తీసిన ‘యాత్ర 2′ కొందరికి నచ్చింది.. ఇంకొందరికి నచ్చలేదు.. తీసిందే పొలిటికట్ మూవీ, రాజకీయ నాయకుడి మీద కాబట్టి.. భిన్నాభిప్రాయాలు రావడం సహజం. కానీ ఓ స్టోరీ టెల్లర్గా నేను అనుకున్న కథ, స్క్రిప్ట్ను తీశాను. కొంత మంది పాజిటివ్గా రివ్యూ ఇచ్చారు. ఇంకొంత మంది నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. ఫిల్మ్ మేకర్లుగా సినిమాను తీయడం మా బాధ్యత. విమర్శించారు కదా? నేనేమీ దాన్ని డిఫెండ్ చేసుకోను. మా టెక్నికల్ టీంకి, మమ్ముట్టి, జీవాకి థ్యాంక్స్. మంచి లక్ష్యంతో తీసిన సినిమాకి ఇంకా మంచి ఫలితం వస్తుందని ఆశిసున్నా. సీఎం వైఎస్ జగన్ త్వరలోనే సినిమా చూస్తారు’ అని తెలిపారు.