మీకు అండగా ఉంటాం: ఎస్సై చిర్ర రమేష్ బాబు
నవతెలంగాణ – నెల్లికుదురు
సోషల్ మీడియా ఎంత వేగంగా విస్తరిస్తున్నదో.. అంతే వేగంతో సైబర్ నేరాల ఉచ్చులో యువత పడిపోతున్నారని. సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని నెల్లికుదురు ఎస్సై చిర్రా రమేష్ బాబు అన్నాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణ పై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా , కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ తో కలిసి వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి చేతిలోకి ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాయని. ఇప్పుడు వాటితో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్నదని, దీనికి రెట్టింపుగా సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతున్నదన్నారు. ఏదో ఒక లింక్ పంపించి ప్రజలకు ఆశ చూపడంతో అమాయక యువత వారి ఉచ్చులో పడి నిలువునా దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్కు స్పందించరాదని తెలిపారు, సైబర్ నేరగాళ్లు పంపే లింక్లను క్లిక్ చేయరాదని యువతకు సూచించారు, సందేశాలకు స్పందిచరాదని తెలిపారు. పండుగలకు షాపింగ్ చేసే సమయంలో ఇచ్చే లాటరీ కూపన్లకు వ్యక్తిగత వివరాలు ఇవ్వరాదన్నారు. గుర్తు తెలియని, అపరిచిత వ్యక్తులతో ఫోన్కాల్స్, వాట్సాప్, ఫేస్ బుక్ చాటింగ్కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దని అన్నారు. బ్యాంక్ నుంచి మట్టాడుతున్నామని, సైబర్ నేరగాళ్లు ఆధార్ నంబర్ చెప్పండి, మీ ఏటీఎం పని చేయడం లేదని, కారు గెల్చుకున్నారని, మనీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో క్రెడిట్ కార్డులిమిట్ పెంచుతామని ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ తెలియకుండానే తన అకౌంట్లో ఉన్న డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే 1930 నంబర్ కి ఫోన్ కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అవగాహనతోనే సైబర్ నేరాలను నివారించే అవకాశం ఉన్నదన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ వెంకటరెడ్డి హెడ్ కానిస్టేబుల్ రవీందర్ కానిస్టేబుల్ సత్యనారాయణ యాకయ్య అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నరు.