– వృద్దులను ఆప్యాయంగా పలకరించిన కలెక్టర్
నవతెలంగాణ – బల్మూరు
జిల్లా స్థాయిగాని.. మండల గ్రామస్థాయిలలో ఆయా శాఖల అధికారులు విధులపై వస్తుంటారు.. పోతుంటారు. ఒక్కో అధికారికి ఒక్కో ప్రత్యేకత. కొందరు ప్రజలకు అందుబాటులో ఉండి కిందిస్థాయి సిబ్బందిచే ప్రజా అవసరాలు తీర్చుతారు. నీతిగా ఉండి మచ్చలేని అధికారులుగా వెళ్ళిపోతారు. మరికొందరైతే ఆశ మితిమీరి చెడ్డవారుగా చిక్కిపోతారు అది వేరు..’ ప్రస్తుతం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ గా గుర్తింపు పొందారు.
అందులో భాగంగానే శనివారం మండలంలోని జినుకుంట గ్రామంలో 80 ఏళ్ల వృద్ధినితో ‘ ఏం పెద్దాయన పెన్షన్ వస్తుందా..? ’ అని పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ చర్చించుకుంటున్నారు. గ్రామానికి చెందిన 80 ఏళ్ల గోరంట్ల సంజన్నను వివరాలు అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని సూచించారు.
గ్రామ సభలో పాల్గొన్న ప్రజలతో కలెక్టర్ ఆత్మీయంగా ముచ్చటిస్తూ గ్రామాభివృద్ధి, తాగునీటి సరఫరా, రహదారులు, విద్యుత్, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై వారి అభిప్రాయాలను సేకరించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని స్పందించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



