నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు కీలకమైన అప్డేట్ ఇచ్చింది. పాఠశాలలకు ప్రకటించిన వేసవి సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ముందుగా జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా, తాజాగా ఆ తేదీని జూన్ 15కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం కావడంతో కేవలం ఒక్క రోజు (జూన్ 12, శుక్రవారం) కోసం పాఠశాలలు తెరిచి, మళ్లీ రెండు రోజులు సెలవులు ఇవ్వడంపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పునఃప్రారంభ తేదీని పునఃపరిశీలించాలని ప్రభుత్వం వద్దకు పలు అభ్యర్థనలు వచ్చాయి.
ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సెలవులను పొడిగించడమే సరైనదని భావించింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు జూన్ 15వ తేదీ సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.



