నవతెలంగాణ -పెద్దవంగర
అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ అయ్యప్ప రెడ్డి, ఎంఈవో బుధారపు శ్రీనివాస్ కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం అందజేశారు.
అనంతరం యూనియన్ నాయకులు స్వరూప, మంజూల మాట్లాడుతూ అంగన్వాడీలు గ్రామీణ ప్రాంతాల్లో తల్లి–శిశు సంక్షేమానికి కీలకంగా సేవలందిస్తున్నప్పటికీ, వారి సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. వెంటనే జీతాలు పెంచి, ప్రతి నెల 1తేదీనే జీతాలు చెల్లించాలన్నారు. ఇంక్రిమెంట్, అలవెన్సులు, బకాయిలు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రేణుక, అంబిక, సరళ తదితరులు పాల్గొన్నారు.



