హైకోర్టులో ప్రభుత్వ వాదన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ చెల్లదంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఐఏఎస్ అధికారి (రిటైర్డు) ఎస్కే జోషి, ఐవిఎస్ అధికారి స్మిత సభర్వాల్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. ఈ పిటిషన్లను కొట్టేయాలంటూ ఏజీ సుదర్శన్రెడ్డి, ఎస్.నిరంజన్ రెడ్డి, ఎస్. శ్రీరామ్ వాదించారు. ‘అందుబాటులో ఉన్న నివేదికలు, రికార్డులు ఆధారంగానే కమిషన్ నివేదిక ఇచ్చింది. 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6 చట్టబద్ధమే. చట్టబద్దంగానే కమిషన్ విచారణ జరిపింది. నోటీసులు ఇచ్చాకే విచారణ జరిపింది.
జీవో వెలువడినప్పుడు పిటిషనర్లు సవాలు చేయలేదు. కమిషన్ రిపోర్టు ఇచ్చే వరకు పిటిషనర్లు వేచి ఉండి హైకోర్టులో సవాలు చేశారు. ఆర్థికంగా పెనుభారం అయ్యేలా ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. విద్యుత్ బిల్లుల భారంగా పెరిగింది. అప్పు చేసి నిర్మాణం చేయడంతో వడ్డీలు అధికంగానే ప్రభుత్వంపై భారం పడింది. రూ.51 311 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయ్యం రూ 1.47 లక్షల కోట్లకు పెరిగింది. ఇంత ఖర్చు చేసినప్పటికీ మేడిగడ్డ పిల్లర్ బీటలు వారింది. కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై అసెంబ్లీ చర్చించింది. సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపధ్యంలో పిటిషన్లను కొట్టేయాలి’. అని వారు వాదించారు. వాదనలు ఈ నెల 10కి వాయిదా పడ్డాయి. కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు ధర్మాసనం పొడిగించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ డివిజన్ బెంచ్ గురువారం ఉత్తర్వులను జారీ చేసింది.
తీర్పు వాయిదా
హుజూర్నగర్ శాసన సభ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అభియోగాలతో పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ మంత్రి ఉత్తమ్కుమారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ సుజన విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్ధినిగా మంత్రి ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేశారు. ఎన్నికల ప్రచారానికి ఉత్తమ్ వెళ్లినప్పుడు జరిగిన రోడ్షో, చర్చీలో మీటింగ్ అనుమతి లేకుండా సమావేశం పెట్టారంటూ నాలుగు కేసులు నమోదు అయ్యాయని వాటిని కొట్టియాలని ఉత్తమ్ పిటిషన్ వేశారు.



