నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ సమీపిస్తున్న వేళ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కలకలం సృష్టించాయి. కోల్కతాలో ఆదివారం తెల్లవారుజామున ఈడీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. కోల్కతా పోలీస్ డిప్యూటీ కమిషనర్ (డీసీపీ) శాంతను సిన్హా బిస్వాస్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. గతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గంలోని కీలకమైన కాళీఘాట్ పోలీస్ స్టేషన్లో బిస్వాస్ ఇన్ఛార్జ్గా పనిచేయడం గమనార్హం.
దక్షిణ కోల్కతాలోని బల్లిగంజ్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన ‘సోనా పప్పు’ సిండికేట్ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. అక్రమ వసూళ్లకు పాల్పడిన ఈ కేసులో ప్రధాన నిందితుడు బిశ్వజిత్ పోద్దార్ అలియాస్ సోనా పప్పు ఇంకా పరారీలోనే ఉన్నాడు. మరోవైపు, బెహాలా ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త జాయ్ కమ్దార్ నివాసంలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. అధికారులు వెళ్లినప్పుడు ఆయన గంటల తరబడి తలుపులు తీయకపోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఇంట్లో జరిపిన సోదాల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం, అక్రమ కట్టడాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల వేళ ఈ పరిణామాలు అధికార తృణమూల్ కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దర్యాప్తులో మరింత మంది పోలీసు అధికారులు, రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.



