– ఆదిలాబాద్లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత
– రాష్ట్రంలో 90కిపైగా ప్రాంతాల్లో పడిన వర్షం
– వచ్చే మూడ్రోజులు పలుజిల్లాలకు వర్షసూచన
– హైదరాబాద్లో ఈదురుగాలులు, వడగండ్ల వాన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓవైపు భానుడు భగభగ మండిపోతున్నాడు.. మరోపక్క రాష్ట్రంలో పలుప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒకేసారి భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్టు అయింది. వాతావరణ శాఖ సమాచారం మేరకు ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. రానున్న రెండు రోజుల పాటు ఉష్ణోగ్ర తల్లో పెద్దగా మార్పులేమీ ఉండబోవని వాతావరణ శాఖ ప్రకటిం చింది. రాష్ట్రంలో వచ్చే మూడ్రోజుల పాటు పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయనీ, ఒకటెండ్రు చోట్ల వడగండ్లు కూడా పడొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. ఆ జాబితాలో కొమ్రంభీమ్ అసిఫాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కా జిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మాల్, నిజామాబాద్, మంచి ర్యాల, మెదక్, కామారెడ్డి ఉన్నాయి. ఆదివారం రాత్రి 9:30 గంటల వరకు రాష్ట్రంలో 98 ప్రాంతాల్లో వర్షం పడింది. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 33 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ వడగండ్ల వానతో జనం సేదదీరారు.





