నవతెలంగాణ–పరకాల
పరకాల జూనియర్ సివిల్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కమిటీ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జి. సాయి శరత్ అధ్యక్షత వహించారు. లోక్ అదాలత్ సభ్యులుగా ఒంటేరు రాజమౌళి, ఎ. రవికుమార్ వ్యవహరించారు.
ఈ సందర్భంగా సివిల్, క్రిమినల్, బ్యాంకు తదితర రాజీపడదగిన కేసులను పరిష్కరించారు. మొత్తం 631 కేసులను పరిష్కరించగా, రూ.12,05,600లను ఫైన్ రూపంలో వసూలు చేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇందులో 627 క్రిమినల్ కేసులు, మూడు సివిల్ కేసులు పరిష్కరించగా రూ.87 వేల నగదు వసూలైంది. అలాగే ఒక బ్యాంకు పీఎల్సీ కేసును పరిష్కరించి రూ.2 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా ట్రాఫిక్ ఈ-చలాన్లు, విద్యుత్, నీటి బిల్లుల వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రుణాల ఈఎంఐ డిఫాల్ట్లు, ఇతర రాజీపడదగిన ఆర్థిక వివాదాలను పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తి జి. సాయి శరత్ తెలిపారు. లోక్ అదాలత్లో కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, సమయం, ఖర్చు ఆదా అవుతాయని చెప్పారు. ఇరువర్గాల అంగీకారంతో కేసులు పరిష్కారం కావడం వల్ల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుకట్ల శ్రీనివాస్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రుధిర, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ మెరుగు శ్రీనివాస్, న్యాయవాదులు, పరకాల, దామెర, ఆత్మకూర్, శ్యాంపేట పోలీసు అధికారులు, బ్యాంకు అధికారులు, కక్షిదారులు, ప్రజలు పాల్గొన్నారు.



