నవతలెలంగాణ – హైదరాబాద్ : కేసీఆర్ భూముల వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 2004 కరీంనగర్ లోక్సభ ఎన్నికల అఫిడవిట్లో తనకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని కేసీఆర్ పేర్కొన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాల భూస్వామ్య కుటుంబంలో జన్మించారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ స్వయంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను గతంలో ఎక్స్లో పంచుకున్న పొంగులేటి.. తెలంగాణ ఉద్యమ కాలంలో, ఆ తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆయన ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లే స్పష్టం చేస్తున్నాయని అన్నారు.
బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు అప్పులు మిగిలితే.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయని పొంగులేటి ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు, పేదలు, దళితులకు చెందిన అసైన్డ్ భూములను దోచుకోవడం వల్లే ఈ ఆస్తులు వచ్చాయా అని నిలదీశారు. అయితే ఇవన్నీ ఆరోపణలేనని, వాటిపై సంబంధిత ఆధారాలు లేదా అధికారిక నిర్ధారణను పొంగులేటి తన పోస్టులో వెల్లడించలేదు.


