నవతెలంగాణ – హైదరాబాద్ : తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు స్వల్ప గాయమైంది. ఓ డ్రోన్కు చెందిన బ్యాటరీ ప్రమాదవశాత్తు ఆమె చేతిపై పడటంతో ఈ ఘటన జరిగింది. అమరావతి ఛాంపియన్షిప్ 2026 కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ డ్రోన్కు సంబంధించిన బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోయింది.
దీంతో ఆ డ్రోన్ కిందికి పడిపోగా, దాంట్లోని బ్యాటరీ ఊడి, నేరుగా వేదికపై ఉన్న మంత్రి అనిత కుడిచేతిపై పడింది. ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న అధికారులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఎస్పీ సుబ్బరాయుడు, మంత్రి అనితకు ప్రథమ చికిత్స అందించి, గాయమైన చేతికి బ్యాండేజ్ వేశారు. అయితే, చేతికి గాయమైనప్పటికీ మంత్రి అనిత బ్యాండేజ్తోనే తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.



