రాజకీయాలకతీతంగా అర్హులందరికీ పట్టాలు
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ప్రజా సంక్షేమమే ధ్యేయం
ఏదులాపురం మున్సిపాలిటీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అర్హులైన నిరుపేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్పిపాలిటీలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్దిదారుల ముఖాల్లో ఆనందం చూస్తుంటే తాను భావోద్వేగానికి లోనవుతున్నానని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన అద్భుతంగా ఉంటుందని చెప్పారు. గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ధ.. పేద ప్రజల ఇండ్లపై పెట్టలేదన్నారు. పేద ప్రజల సొంతింటి కల సాకారం కోసం రూ.22,500 కోట్లను ప్రజా ప్రభుత్వం ఈ ఏడాది కేటాయించిందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా పేదల సంక్షేమమే ఎ జెండాగా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడా లంచాలకు ఆస్కారం లేకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, చెంచులకు పూర్తి స్థాయిలో మంజూరు చేస్తున్నట్టు వివరించారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు అందించే ఇండ్లు మొదటి విడత మాత్రమేనని, ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉంటుందన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రస్తుతం 520 మందికి ఇండ్లు మంజూరు చేసినట్టు చెప్పారు. ఇంకా అర్హులున్నారని, వారికీ ఇస్తామని తెలిపారు. నాణ్యమైన ఇండ్ల నిర్మాణంపై జిల్లా స్థాయి అధికారి నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు శిక్షణ ఇచ్చామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద ముందస్తుగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇప్పటి వరకు 50 ఇండ్లు పూర్తి చేశామని, 500 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నట్టు తెలిపారు. ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తున్నదని అన్నారు. ఖమ్మం జిల్లాలో మొదటి విడతలో 17 వేలకు పైగా లబ్దిదారులకు ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఆర్డీఓ నరసింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇండ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES