విజయవాడ: తైవాన్లో ఈ నెల 11 నుండి 19 వరకు జరిగిన ‘2026 తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ కాంపిటీషన్స్’లో చైత్రదీపిక మెరుగైన ప్రతిభను కనబర్చి యూత్ కేటగిరీలో ఇన్ లైన్ ఈవెంట్లో రజత పతకం, సోలో డాన్స్ ఈవెంట్లో కాంస్య పతకం మరియు క్యాడెట్ కేటగిరీ షో గ్రూప్ ఈవెంట్లో రజత పతకాలు సాధించింది. వరుసగా నాలుగోసారి అంతర్జాతీయ స్థాయిలో అద్భుత క్రీడా ప్రతిభతో దేశానికి విశేషమైన గౌరవాన్ని తీసుకొచ్చింది. చైత్ర ఈ విజయాలుతో 61 పతకాలు సాధించి తన ప్రతిభను చాటుకుంది. భారత్ తరపున స్కేటింగ్లో ఆరు దేశాలకు (జపాన్, కొరియా, యుక్రెయిన్, ఆస్ట్రేలియా, నమీబియా మరియు నైజీరియా) దీటైన పోటీ యిచ్చి మూడు పతకాలు సాధించింది. 2023, 2025లలో చైనా, తైవాన్, ఆస్ట్రేలియాలోలో జరిగిన 19వ ఆసియన్ రోలరు స్కేటింగ్ ఛాంపియన్షిప్ (వరల్డ్ స్కేటింగ్ అసోసియేషన్), తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ కాంపిటీషన్స్ మరియు వరల్డ్ స్కేట్ పసిఫిక్ కప్లలో ప్రాతినిధ్యం వహించి ఏడు బంగారు పతకాలను సాధించింది. ఎన్టిఆర్ జిల్లా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది. దీంతో చైతన్య దీపికను, రోలరు స్కేటింగ్ కోచ్ పి. సత్యనారాయణను పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.



