మానవుడే నా సంగీతం, మనుష్యుడే నా సందేశం అనడం ద్వారా అతనికి మనిషి మాత్రమే ముఖ్యం – ఏ దేశం వాడైనా. అందుకే చైనాలో రిక్షా వాలాను, చెక్ దేశపు గని పనిమనిషిని, ఐర్లాండ్ ఓడ కళాశిని అందరినీ తన కవిత్వంలో స్పృశించాడు. అణగారిన ఆర్తులందరూ పీడిత తాడిత ప్రజానీకం ఆయన కవిత్వం నిండా కనిపిస్తారు. పేదల గుండెలను అశ్రువులు నిండిన కుండలుగా వర్ణిస్తాడు. గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, దౌర్జన్య రాజ్యం ధ్వంసించు రష్యా అంటూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల గొంతుకల వాణిని తాను వినిపించినవాడు. కోటి చేతులు రష్యాను, ఆ దేశపు వాదాన్ని ఆహ్వానిస్తున్నట్టు పాడినవాడు. కార్మికలోకం కల్యాణము, శ్రామికలోకపు సౌభాగ్యము అతని కవితల్లో ప్రతిబింబించింది. ఆయన గీతం జాతి జనుల గుండెల్లో ప్రతిధ్వనించింది. కమ్యూనిజమే తన సుప్రభాత గీతమని పేర్కొన్నది. ఆ వ్యాఖ్యకు నిజంగా మహాకవి శ్రీశ్రీ కచ్చితంగా అర్హుడే! అద్దం లాంటి సమాజానికి ప్రతిబింబం లాంటి సాహిత్యాన్ని అందించిన వాడు. ‘అలజడి మా ఊపిరి, ఆందోళన మా జీవితం, తిరుగుబాటు మా వేదాం తం’ అంటూ ఎలుగెత్తి చాటాడు. కష్టజీవికి రెండు వైపులా ఉండేవాడే కవి అని నిర్వచించాడు, వ్యక్తికి బహువచనం శక్తి అని సూచించాడు.
ఆయన కవిత్వం లో ప్రాపంచిక దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ దేశంలోనైనా ఏకాకివి కావు నీవు, వీర వియత్నా ంలోన విజయ గీతి పాడావు, అదిగదిగో బంగ్లాలో అగ్గివాన కురుస్తుంది, ఇదిగిదిగో సిలోనులో ఎర్రసేన కదులుతోంది అంటూ విప్లవకారులను వెన్నుతట్టి ప్రోత్సహించాడు, ఉరికించాడు. వియత్నాంలో నిజమైంది. శ్రీలంకలోను రుజువయింది. కమ్యూనిజం లోనే నిజం ఉందని ఆనాడే ప్రబోధించాడు. అమెరికా జులుం బెడిసింది, రష్యా హయాం ముగిసింది, ఇంగ్లాండ్ తోక ముడిచింది, ఐరాస కోరస్గా అరిచింది, జనచైనా గెలిచింది అంటూ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను తన మరుక్కులలో విశ్లేషించాడు. రెండు రెళ్లు నాలుగన్నందుకు గుండాలు గుండ్రాళ్లు విసిరే సీమలో, క్షేమం అవిభాగ్యం అంటే జైళ్లు నోళ్లు తెరిచే భూమిలో అంటూ నిజం చెప్పేవాడిని, సంక్షేమాన్ని ఆకాంక్షించే వాడిని రాజ్యం ఏ విధంగా శిక్షిస్తుందో దాదాపు 75 ఏళ్ల క్రితమే ఊహించిన మహానుభావుడు. మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయించడం ఆయనకే చెల్లింది. ఇది ప్రపంచ కుగ్రామం, ఇది గ్లోబల్ సంగ్రామం, ఎడతెగనిది సంక్షేమం, ముందున్నది సంక్షోభం అని 1971లోనే శ్రీశ్రీ ఎంతో దూరదృష్టితో చెప్పటం చాలా ఆశ్చర్యకరం. ప్రపంచం ఒక కుగ్రామం అవుతుందని సంక్షోభం కూడా విశ్వవ్యాప్తమని ఆనాడే ఊహించాడు. బాతాకాని క్లబ్బులు బాపతుగా పనిచేసే శాసనసభ ఎలా ప్రజాస్వామ్యం నిలబెట్టగలవని చట్టసభల ఔన్నత్యాన్ని యాభై ఏండ్ల క్రితమే ప్రశ్నించాడు. దొంగనోట్ల..దొంగఓట్ల రాజ్యం..ఒక రాజ్యమా? లంచగొండి వెధవలిచ్చు సాక్ష్యం..ఒక సాక్ష్యమా? కమ్యూనిజానిదే తుది విజయమని నిర్భయంగా తేల్చేసిన సాహసికుడు. తలకాయలు తమ తమ జేబుల్లో దాచుకొనుచు పోలింగుకు పోవలసిన రోజులు వస్తే ‘సెలవింక డెమోక్రసీకి సిరిసిరిమువ్వ’ అంటూ అది ఏ విధంగా భవిష్యత్తులో అపహాస్యం అవుతుందో ఆనాడే హెచ్చరించాడు. ముందుకు పోతాం మేము, ప్రపంచం మావెంట వస్తుంది..అనే పదాల్లో గొప్ప ఆశావాదాన్ని వ్యక్తీకరిస్తూనే ప్రపంచాన్ని పరిహసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం అని ఢంకా భజాయించాడు.
1955 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీకి సంఘీభావం తెలిపి ఎన్నికల ప్రచారం చేశాడు. నాటి తెలంగాణ పోరాట కావ్యాలు, గేయాలు అన్నింటి పైన మహాప్రస్థానం ముద్ర ఎవరు కాదనలేనిది. పౌరహక్కుల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అభ్యుదయ రచయితలకు, ఆ తర్వాత విప్లవ రచయితలకు మార్గదర్శిగా నిలిచాడు. కలంతో ఖడ్గం సృష్టించి జనంతో స్వర్గం నిర్మించే ప్రయత్నం చేశాడు. ఆకాశప ఎడారింట హడావుడిగా పడిపోయే జగన్నాథుని రథచక్రాలను భూమార్గం పట్టించినా, భూకంపం పుట్టిం చినా అది శ్రీశ్రీకే సాధ్యమైంది. గోడలు లేవు మాకు, గోడలను పగులగొట్టడమే మా పని అంటూ తన లక్ష్యమైన విశ్వజనీనతను రెండు మాటల్లో చెప్పాడు. సినీ రంగం లోనూ తనదైన ముద్ర వేశాడు, ఎర్రబావుటా ఎగరేశాడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపో వద్దని భూమికోసం సినిమాలో హెచ్చరించాడు. ‘రాబంధు రాజ్యానికూల్చండి పునాదులు, కామందుల చట్టానికి కట్టండి సమాధులు’ అని సినీ గీతాల్లోనూ పిలుపునిచ్చిన వాడు.
శ్రీశ్రీ పుట్టకపోతే ఈనాటి కవిత్వం ఎలా ఉండేదో అనేది నిజంగా చర్చనీయాంశమే! లాటిన్, జర్మన్, ఫ్రెంచ్, ఆంగ్లం, రష్యన్ ఇంకా అనేక విదేశీ భాషలను ఔపాసన పట్టి భాషపైన పట్టు సంపాదించాడు. ప్రపంచ రాజకీయాలను ఆకలింపు చేసుకున్నాడు. పదవిన్యాసం ఆయన ప్రత్యేకత. తేలికగా రాయడం అంత కష్టమైన పని లేదంటాడు. తన కలల సామ్రాజ్యమైన మరో ప్రపంచానికి బాటలు వేసినవాడు. సామ్రాజ్యవాద శక్తులను వ్యతిరేకించాడు. నెత్తురు మండే శక్తులు నిండే యువకులను ఉద్యమ ఆకర్షితులుగా చేశాడు. ఆయన కవిత్వంలో రాబంధుల రెక్కలచప్పుడు వయోధర ప్రచండగోషం ఝంఝానిల షడ్జధ్వానం మారుమోగు తూనే ఉంటాయి. రేపు సూర్యుడు పడమట పొడిచి శ్రీశ్రీకి జ్ఞానపీఠం వారు లక్ష రూపాయలు బహుకరించినా ఆ బహుమతి కన్నా శ్రీశ్రీ ఎత్తున ఉంటాడు. ‘శ్రీశ్రీ కన్నా మిన్న ఏదైనా ఉంటే అది శ్రీశ్రీ కవిత మాత్రమే’ అన్న కొడవటిగంటి మాటలు అక్షర సత్యాలు.
- శ్రీనివాస కుమార్, 9440354092