కృత్రిమ కొరతతో పెట్రోల్ బంకుల వద్ద భారీ లైన్లు
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిపై సీపీఐ(ఎం) ఆగ్రహం..హెచ్పీసీఎల్ రీజనల్ కార్యాలయం ఎదుట ధర్నా
కార్పొరేషన్ రీజనల్ మేనేజర్కు వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతను సృష్టించి, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ చమురు కంపెనీలు దోచుకుం టున్నాయని సీపీఐ(ఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండదం డలతోనే ఈ బ్లాక్ మార్కెటింగ్ జరుగు తోందని ఆరోపించింది. కృత్రిమ కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ బుధ వారం హైదరాబాద్లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) రీజనల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించింది. దీనికి సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భం గా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి మాట్లాడుతూ.. బెంగాల్ ఎన్నికల ప్రక్రియ ముగియ గానే పెట్రో ధరలు పెంచేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసిందని విమర్శిం చారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకపోయినా, కృత్రిమ కొరత చూపి అధిక ధరలకు విక్రయించేలా చమురు సంస్థలకు కేంద్రం సహకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ బీహార్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గ్యాస్ ధరలు పెంచి కానుకగా ఇచ్చిందని తెలిపారు.
అమెరికా ఆంక్షలకు తలొగ్గిన మోడీ
రష్యా నుంచి చౌకగా ముడి చమురు లభించే అవకాశం ఉన్నప్పటికీ, అమెరికా ఆంక్షలకు భయపడి మోడీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర మాజీ కార్యదర్శి, రాష్ట్ర నాయకులు ఎం.శ్రీనివాస్ అన్నారు. పెట్రోల్ బంకుల యజమానులు ముందస్తుగా డబ్బులు చెల్లించినా, ఆయిల్ కంపెనీలు సరుకు సరఫరా చేయకుండా కొరత సృష్టిస్తున్నాయని చెప్పారు.
‘నో స్టాక్’ బోర్డుల వెనుక మర్మమేంటి ?
పెట్రోల్ బంకుల వద్ద భారీ లైన్లు కనిపిస్తున్నాయని, అనేక చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్ అన్నారు. కేంద్రం వద్ద నిల్వలు నిండుగా ఉన్నాయని చెబుతూనే, క్షేత్రస్థాయిలో సరఫరా ఆపడం వెనుక కార్పొరేట్ శక్తుల లాభాలే పరమావధిగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం హెచ్పీసీఎల్ రీజనల్ మేనేజర్ రాహుల్కు వినతిపత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర నాయకులు ఎం.మహేందర్, ఎ.పద్మ, ఎం.అజరుబాబు, నగర కార్యదర్శివర్గ సభ్యులు కె.నాగలక్ష్మి, నాయకులు ఎం.శ్రీనివాస్ రావు, జి.నరేష్, జి.కిరణ్, ఎస్.మారన్న, టి.శేషగిరిరావు, ఎం.సత్యనారాయణ, ఎం.కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.



