Saturday, June 7, 2025
E-PAPER
Homeక్రైమ్రాజేంద్రనగర్‌లో జంట హత్యల కలకలం

రాజేంద్రనగర్‌లో జంట హత్యల కలకలం

- Advertisement -

– వృద్ధ దంపతులను గొంతు కోసి చంపిన దుండగులు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని జనచైతన్య ఫేజ్‌-2లో జంట హత్యల ఘటన కలకలం లేపింది. వృద్ధ దంపతులను దారుణంగా గొంతు కోసి చంపిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్‌ అబ్దుల్లా(70), రిజ్వానా(65) భార్యా భర్తలు. షేక్‌ అబ్దుల్లా రిటైర్‌ ఎస్‌బీఐ బ్యాంక్‌ ఉద్యోగి. అయితే వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు అమెరికాలో, కూతుళ్లు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. అయితే ఇటీవల షేక్‌ అబ్దుల్లా రాజేంద్రనగర్‌లో జనచైతన్య ఫేజ్‌-2లో నూతనంగా ఐదంతస్తుల భవనాన్ని నిర్మించాడు. కింద నాలుగు అంతస్తులు ఇతరులకు అద్దెకిచ్చాడు. ఐదో అంతస్తులో షేక్‌ అబ్దుల్లా, అతని భార్య రిజ్వాన ఉంటున్నారు. అయితే గురువారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు ఇంటి ఓనర్‌కి ఫిజియోథెరపీ చేయాలని అపార్ట్‌మెంట్‌ కింద వాచ్‌మెన్‌ని పైకి వెళ్లడానికి పర్మిషన్‌ అడిగారు. వెంటనే వాచ్‌మెన్‌ ఇంటి ఓనర్‌ షేక్‌ అబ్దుల్లాకు ఫోన్‌ చేసి ఇద్దరు వ్యక్తులు ఫిజియోథెరపీ చేయడానికి వచ్చారు.. పైకి పంపాలా అని అడిగారు. వెంటనే అతను పైకి పంపు అని చెప్పడంతో వాచ్‌మెన్‌ వారిద్దరిని పైకి పంపించాడు. ఇందులో ఒకరు బుర్కా ధరించగా.. మరొకరు టోపీ మాస్క్‌ పెట్టుకున్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం అయినా ఇంటి ఓనర్‌ కిందకి రాకపోవడంతో వాచ్‌మెన్‌ ఐదవ అంతస్తులోకి వెళ్లి చూడగా.. దంపతులు ఇద్దరు రక్తపు మడుగులో ఉన్నారు. వెంటనే వాచ్‌మెన్‌ రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీంతో ఆధారాలను సేకరించారు. దుండగులు డబ్బు కోసమే వీరిద్దరిని హత్య చేశారా?.. మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అని పోలీసులు విచారిస్తున్నారు. అదేవిధంగా వాచ్‌మెన్‌ దంపతులనూ పోలీసులు ప్రశ్నించారు. దుండగులు వచ్చిన బైక్‌ నెంబర్‌, సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇతర దేశాల్లో ఉన్న దంపతుల కుమారులు, కూతుళ్లకు సమాచారం అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -