ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి సత్తా చాటాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటర్ల జాబితాలో కోహ్లి 5వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కేవలం 120 బంతుల్లో 135 పరుగులతో రాణించడంతో అతని ర్యాంక్ మెరుగైంది. తాజా ర్యాంకింగ్స్లో కోహ్లి 751రేటింగ్ పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. దీంతో 15నెలల తర్వాత విరాట్ కోహ్లి తొలిసారి కెరీర్ బెస్ట్ ర్యాంక్లో నిలిచాడు. 2024లో కోహ్లి తొలిసారి 4వ స్థానంలో నిలువగా.. మళ్లీ ఇన్నాళ్లకు ఐసిసి ర్యాంకింగ్స్లో మళ్లీ అదే ర్యాంక్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ 4వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికాపై అర్ధశతకంతో మెరిసిన రోహిత్ శర్మ ఖాతాలోనూ 32పాయింట్లు జమ అయ్యాయి.
ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్లో పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ టాప్ ర్యాంక్లోనే ఉన్నాడు. డారీ మిఛెల్(న్యూజిలాండ్), ఇబ్రహీం జడ్రాన్(ఆఫ్ఘనిస్తాన్) 764రేటింగ్ పాయింట్లతో 2, 3 స్థానాల్లో నిలువగా.. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు దూరమైన గిల్.. 5వ స్థానానికే పరిమితమయ్యాడు. బౌలర్ల జాబితాలో కుల్దీప్ యాదవ్ ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ ఐసిసి ప్రకటించిన తాజా బౌలర్ల ర్యాంకింగ్స్లో 6వ స్థానంలో నిలిచాడు. ఇక టెస్ట్ బౌలర్ల జాబితాలో దక్షిణాఫ్రికా పేసర్ యాన్సెన్ తొలిసారి కెరీర్ బెస్ట్ 5వ ర్యాంక్కు చేరుకున్నాడు. భారత్పై అతడు రెండు టెస్టుల్లో ఏకంగా 12 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా జట్టు 2-0తో సిరీస్ను కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.



