నవతెలంగాణ-హైదరాబాద్: యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ముప్పు ఉందని సీపీఐ(ఎం )పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మంగళవారం నల్లగొండ నగరంలోని స్టే ఇన్ హోటల్ లో ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం అనే అంశంపై టీఎస్ యూటీఎఫ్, సీఐటీయూ, పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం నల్లగొండ ఆధ్వర్యంలో పీపుల్స్ పోగ్రస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు అధ్యక్షతన నిర్వహించారు. సెమినార్ ను రాఘవులు ప్రారంభించి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ రౌడీలాగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలపై ఆధిపత్య పెత్తనం సాగించాలని ఆకాంక్షతో వెనిజులా అధ్యక్షుడిని అరెస్టు చేసి నిర్బంధించారన్నారు. ఇరాన్, వెనిజులా దేశాలలో ఉన్న చమరు నిల్వలను ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆరాటంతో యుద్ధం ప్రారంభించారన్నారు.
భారతదేశ ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ అమెరికా చెప్పుచేతల్లో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తూ ట్రంప్ ఆదేశాలను పాటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ సూచించిన దగ్గర వ్యాపారం కొనసాగించాలని చెప్పడంతో విశ్వ గురువుగా చెప్పుకునే మోడీ విశ్వ బానిసగా మారిపోయారని అభివర్ణించారు. ప్రపంచ రౌడీలాగా వ్యవహరిస్తున్న ట్రంప్ విధానాలతో ఆర్థిక పరిస్థితులు తారుమారు అవుతున్నాయని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.



