నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
బాల్య వివాహాలను అరికట్టడంతోపాటు,బాలికల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని,జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం నుండి నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాన్ని పురస్కరించుకుని మంగళ వారం నల్గొండ పట్టణంలోని రెడ్ క్రాస్ భవనంలో మహిళ ,శిశు,దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహల రహిత తెలంగాణ లక్ష్యంతో “బాల్య వివాహ నిషేధ చట్టం–2006”పై విద్యార్థులకు ఉద్దేశించి నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
బాధ్యతగా ముందుకు రావాలి, బాల్య వివాహాలను అరికట్టేందుకు విద్యార్థులు చైతన్యవంతంగా వ్యవహరించాలి, బాల్య వివాహాల వల్ల ఎంతోమంది బాలికల జీవితాలు దెబ్బతింటున్నాయి, కుటుంబాల్లో ఆవేదన మిగులుతున్నదని అన్నారు.విద్యార్థులు తమ ప్రాంతాల్లో జరిగే బాల్య వివాహాలపై పోలీసులు లేదా అధికారులకు సమాచారం అందించాలని, బాలికలు సంఘాలుగా ఏర్పడి తమ సమస్యలను పంచుకోవాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమన్నారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న వెల్ఫేర్ వీక్ ద్వారా పిల్లలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నదని, ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని చెప్పారు. విద్యార్థులు సోషల్ మీడియాను అతి మోతాదులో ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలని, ఏఐ ఫోటో మార్ఫింగ్ వంటి సైబర్ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం ఎంతో ముఖ్యమని, సమాజంలో తలెత్తుకుని జీవించేలా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. బాలికల సమస్యలపై ప్రతి నెల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే సహకారం అందిస్తామని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రణామం వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను సందర్శించి అక్కడి వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు క్యారంస్ ఆడుతుండగా వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అనవసరంగా బయట తిరగవద్దని సూచించారు. అవగాహన కార్యక్రమానికి రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సిడిపిఓ లావణ్య ,సిడబ్ల్యూసి చైర్మన్ చింత కృష్ణయ్య,సిడబ్ల్యూసి సభ్యులు భాస్కర్ వెంకన్న, డిసిపిఓ గణేష్ హాజరయ్యారు.



