నవతెలంగాణ పళని: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పళని నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎన్. పాండేకు ఓట్లు వేయాలని ప్రముఖ సినీ నటి రోహిణి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగానూ, రైతు సంఘం నాయకుడిగానూ ఉన్న ఎన్. పాండే ఎన్నికల ప్రచార సభకు రోహిణి హాజరై మాట్లాడారు. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఏకతాటిపై నిలిచి తమ గళం వినిపించాలని ఆమె పిలుపునిచ్చారు.
”మన దేశంలోని స్నేహపూర్వక వాతావరణాన్ని ధ్వంసం చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా మనమందరం ఏకమై గళం విప్పాల్సిన సమయం ఇదే. ప్రజల హక్కుల కోసం ఎల్లప్పుడూ ముందుండి పోరాడే కమ్యూనిస్టు పార్టీ యొక్క పోరాట స్ఫూర్తి, దేశానికి అత్యంత ఆవశ్యకం. అధికారంలో లేనప్పుడు కూడా, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం వీధుల్లోకి వచ్చి పోరాడేది కమ్యూనిస్టులే. ఏ దశలోనైనా సామాన్య ప్రజల గొంతుకగా నిలిచే వీరికి అధికారం లభిస్తే, అది దేశ అభివృద్ధికి, భద్రతకు గొప్ప బలంగా మారుతుంది. మన దేశ సహజ వనరులను కార్పొరేట్ శక్తులు దోచుకోకుండా అడ్డుకోవడంలో, వామపక్ష ప్రతినిధులు ఒక రక్షణ కవచంలా నిలబడగలరు. అణగారిన, అట్టడుగు వర్గాల ప్రజల గొంతుక అసెంబ్లీల్లోనూ, పార్లమెంటులోనూ వినిపించాలి. ఎన్. పాండే వంటి ప్రజాదరణ కలిగిన నాయకులు భారీ మెజారిటీతో గెలిచేలా చూడటం నేటి తక్షణావసరమని” రోహిణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుండి నటి రోహిణి సీపీఐ(ఎం) తరపున ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు.



