Saturday, August 2, 2025
E-PAPER
Homeఆటలుపీసీబీ కీల‌క నిర్ణ‌యం.. పాకిస్థాన్ పేరు వాడ‌కంపై నిషేధం

పీసీబీ కీల‌క నిర్ణ‌యం.. పాకిస్థాన్ పేరు వాడ‌కంపై నిషేధం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మైదానంలోనే కాదు, వెలుపల కూడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 టోర్నమెంట్‌లో చోటుచేసుకున్న వివాదం కారణంగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టుతో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ జట్టు నిరాకరించడంతో అంతర్జాతీయంగా పెద్ద దుమారం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పీసీబీ అనధికారిక టోర్నమెంట్లలో ‘పాకిస్థాన్’ పేరును ఉపయోగించకుండా నిషేధం విధించింది.

ఈ వివాదంపై చర్చించేందుకు పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఆగస్టు 1న బోర్డు సభ్యులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. బోర్డు గుర్తింపు లేకుండా, అనధికారికంగా ‘పాకిస్థాన్’ పేరుతో జట్లు అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొనడం వల్ల దేశం మరియు బోర్డు ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలుగుతోందని సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం. ముఖ్యంగా, ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు జాతీయ స్థాయిలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని పీసీబీ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ప్రైవేట్ లేదా అనధికారిక టోర్నమెంట్లలోనైనా నిర్వాహకులు గానీ, జట్లు గానీ పీసీబీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ‘పాకిస్థాన్’ పేరును వాడరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

భారత్, పాక్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఐసీసీ టోర్నీలలోని మ్యాచ్‌లను సైతం తటస్థ వేదికలపై నిర్వహించాల్సి వస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ కొత్త వివాదం ఇరు దేశాల క్రికెట్ సంబంధాలను మరింత దెబ్బతీసేలా ఉంది. పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో జరిగే లెజెండ్స్, ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల నిర్వహణపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -