నవతెలంగాణ-హైదరాబాద్ : డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్కు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడగా, ఆయన కారు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ మహబూబాబాద్ కలెక్టరేట్కు బయలుదేరారు. మార్గమద్యంలో చింతపల్లి వద్దకు రాగానే ఆయన కారులో నుంచి పొగలు రావడం మొదలైంది. కారులో ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్లో మంటలు వేగంగా వ్యాపించాయి.
వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే, సిబ్బంది కారును నిలిపివేసి కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్ మాత్రం స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్ కలెక్టరేట్కు బయలుదేరి వెళ్లారు. తమ నాయకుడి కారులో మంటలు చెలరేగాయన్న వార్త తెలియడంతో నియోజకవర్గ ప్రజలు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ఆయన సురక్షితంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.



