నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణను రాజకీయంగా కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత శ్రీరాం రెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. నోటీసుల మేరకు ఆయన సోమవారం బషీర్బాగ్లోని పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు.
దౌల్తాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న శ్రీరాం రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా పేరుపొందారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం, రేవంత్ రెడ్డి కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు శ్రీరాం రెడ్డి ఫోన్ను ట్యాప్ చేసినట్లు సిట్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలు, ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే లక్ష్యంగా ఈ ట్యాపింగ్ జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీరాం రెడ్డి ఫోన్ను ఏయే కాలాల్లో ట్యాప్ చేశారు, ఎవరెవరితో జరిపిన సంభాషణలను రికార్డ్ చేశారు వంటి సాంకేతిక అంశాలపై సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. విచారణలో భాగంగా శ్రీరాం రెడ్డి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు, ఆయన మొబైల్ ఫోన్లు, కాల్ డేటా రికార్డులను కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.



