నవతెలంగాణ – హైదరాబాద్ : నిన్నటివరకు కలిసి నడిచిన మిత్రులు.. నేడు రాజకీయ శత్రువులుగా మారారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే, కాంగ్రెస్ మధ్య మొదలైన విభేదాలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఘాటు విమర్శలతో దక్షిణాది రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ను ఇకపై ఎప్పటికీ నమ్మబోమంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కష్టకాలంలో డీఎంకేకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీనే అని ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. డీఎంకే మైనారిటీలో ఉన్నప్పుడు తాము బయటి నుంచి మద్దతు ఇచ్చామని, ఉదయనిధి మాట్లాడిన మాటలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని మండిపడ్డారు.
తమిళనాడులో బీజేపీ కాలు మోపకుండా అడ్డుకోవడమే కాంగ్రెస్ ఉద్దేశమని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. అందుకోసమే గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్కు చెందిన టీవీకే పార్టీతో కూటమి కట్టామని చెప్పారు. డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు లోపాయికారీగా బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటున్నాయనే అనుమానంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.



