నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ(ఎం) సీనియర్ నేత, రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయానికి ఆయిల్ఫామ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య నివాళులర్పించారు. హృదయ సంబంధ వ్యాధితో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి సోమవారం మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని మంగళవారం పార్టీ కార్యాలయం హైదరాబాద్ లో పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఉంచారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకత్వంతో కలిసి పుల్లయ్య మల్లారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేశారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో మల్లారెడ్డికి ఎంతో అనుబంధం ఉందన్నారు. ఈ ప్రాంతంలోని పామాయిల్ రైతుల సమస్యలు, సీతారామ ప్రాజెక్టు, జిల్లాలోని నదులు, వాగులు, వ్యవసాయ రంగంపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందని పేర్కొన్నారు.
జీవితాంతం పార్టీ విస్తరణ, రైతుల సంక్షేమం, విప్లవ భావజాల అభివృద్ధికి కృషి చేసిన ఆదర్శ కమ్యూనిస్టు మల్లారెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పుల్లయ్య పిలుపునిచ్చారు.



