బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి: మారపల్లి సుధాకర్
నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో డాటా ఎంట్రీ ఆపరేటర్గా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న శ్రీధర్ బాబు (39) ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని, ఈ విషాద ఘటన యావత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కలచివేసిందని తెలంగాణ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు మారపల్లి సుధాకర్ ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీధర్ బాబు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలో ఉన్నప్పటికీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉన్న ఉద్యోగ భద్రత లేమి, ప్రతి నెలా జీతాల ఆలస్యం, రెన్యువల్ జీవోల జాప్యం, ఆర్థిక ఇబ్బందులు, అధికారుల వేధింపుల కారణంగా మానసిక క్షోభకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారని ఆయన తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి బతకలేక ఆత్మహత్య చేసుకోవడం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డికి కూడా మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశామని తెలిపారు. శ్రీధర్ బాబు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.



