బాలుడి ఆరోగ్య పరిస్థితిపై జీహెచ్ఎంసీ అధికారులను ఆరా
మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ హయత్నగర్లో మూగ బాలుడు ప్రేమ్ చంద్పై మంగళవారం వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం సీఎంవో, జీహెచ్ఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఖర్చుకు వెనుకాడకుండా మెరుగైన వైద్యం అందించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. బాలుడి వైద్య ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించాలని చెప్పారు. బాలుడి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి వారి బాగోగులు పరిశీలించి, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని సీఎం సూచించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కూడా ఈ ఘటనపై వివరాలు తెలుసుకుని.. బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష
బాలుడు ప్రేమ్ చంద్ ఆరోగ్య పరిస్థితిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి వకీల్తో సమీక్షించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం స్వయంగా ఆరా తీశారని తెలిపారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కమిషనర్ సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని బహిరంగ ప్రదేశాలలో వీధి కుక్కలు లేకుండా ఇప్పటికే చేపట్టిన డ్రైవ్ను మరింత ముమ్మరం చేయాలన్నారు.



