నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ ప్రయాణం నిరాశతో ముగిసినప్పటికీ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం తన నాయకత్వ పటిమపై బలమైన వైఖరిని ప్రదర్శించాడు. సీజన్ ఆరంభంలో జట్టు వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓటమి పాలైనప్పుడు కెప్టెన్సీని వదిలేయాలనే ఆలోచన తనకు ఏమాత్రం రాలేదని స్పష్టం చేశాడు. సవాళ్లను చూసి వెనకడుగు వేసే వ్యక్తిత్వం తనది కాదని, కష్టకాలంలోనే జట్టుకు అండగా నిలబడటం ముఖ్యమని అన్నాడు. ఈ సందర్భంగా రహానే మాట్లాడుతూ.. “కష్ట సమయాల్లోనే మన వ్యక్తిత్వం బయటపడుతుంది. నేను ఎప్పుడూ వెనకడుగు వేయను. ఓటముల సమయంలో ఒత్తిడి సహజమే, కానీ దాన్ని తట్టుకుని బలంగా నిలబడటం ముఖ్యం. గతాన్ని, భవిష్యత్తును గురించి ఆలోచించకుండా వర్తమానంలో నిలబడగలిగితే పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు” అని వివరించాడు.
ఇదే సమయంలో ఇద్దరు యువ ఆటగాళ్లు కార్తీక్ త్యాగి, అనుకుల్ రాయ్లను రహానే ప్రత్యేకంగా అభినందించాడు. ఈ సీజన్లో పేసర్ త్యాగి 18 వికెట్లు పడగొట్టగా, ఆల్రౌండర్ అనుకుల్ రాయ్ 9 వికెట్లు తీయడంతో పాటు రెండు విజయవంతమైన ఛేజింగ్లలో కీలక పాత్ర పోషించాడు. “వారిద్దరికీ ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో భారత జట్టు తరఫున ఆడే సత్తా వారికి ఉంది” అని రహానే విశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే, గాయాలతోనే ఆడిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గురించి కూడా రహానే మాట్లాడాడు. కాలి వేలికి, చేతి వేళ్లకు ఫ్రాక్చర్లు అయినప్పటికీ అతను ఆడటంపై స్పందించాడు. “మా జట్టు ఫిజియోలు, బీసీసీఐ, ఎన్సీఏ ఫిజియోలు చర్చించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. అతని గాయాలు తీవ్రం కావని వారు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆడాలనే తపన వరుణ్ వైపు నుంచి వచ్చింది. జట్టు కోసం ఆడాలనే అతని సంసిద్ధత అందరికీ ఒక సానుకూల సందేశాన్ని ఇచ్చింది” అని రహానే తెలిపాడు.



