Monday, May 25, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ పేపర్ లీక్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..

నీట్ పేపర్ లీక్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ పేపర్ లీక్ ఘటనలపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో కోర్టు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా, ఎన్ని వివాదాలు తలెత్తినా ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్‌టీఏ) ఇప్పటికీ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు.. కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.

పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని ఫైమా, యూడీఎఫ్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. లోపభూయిష్టంగా మారిన ఎన్‌టీఏ స్థానంలో సరికొత్త వ్యవస్థను తీసుకురావాలని లేదా దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోర్టును కోరారు. నీట్ యూజీ పరీక్షలను కట్టుదిట్టంగా, స్వతంత్రంగా నిర్వహించేలా ఒక పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు.

గత నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత పరీక్షల పర్యవేక్షణ కోసం కోర్టు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గతేడాది నవంబర్ 14న ఏర్పాటైన ఈ మానిటరింగ్ కమిటీ చేసిన సిఫార్సులను ఎంతవరకు అమలు చేశారో స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్‌టీఏను ఆదేశించింది. ఈ కమిటీకి నేతృత్వం వహించిన జస్టిస్ రాధాకృష్ణన్ కూడా సిఫార్సుల అమలుపై తీసుకున్న చర్యలను కోర్టుకు వివరించాల్సి ఉంటుంది. ఈ అఫిడవిట్లను మూడు రోజుల్లోగా సమర్పించాలని గడువు విధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -