నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం ఢిల్లీ వేదికగా జరిగిన 37వ SIDBI ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, అలాంటి వాటికి తావులేదని స్పష్టం చేశారు. దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే ప్రభుత్వం దాదాపు రూ.లక్ష కోట్ల ఆదాయం నష్టపోతుందని వెల్లడించారు.
పశ్చిమాసియా సంక్షోభం మొదలై మూడు నెలలు కావస్తున్న తరుణంలో ప్రభుత్వం ‘3-ఎఫ్’ (ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫారెక్స్ – ఇంధనం, ఎరువులు, విదేశీ మారకం)పై ప్రత్యేక దృష్టి సారించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్ల ఎరువుల ధరలు ఊహించని స్థాయికి చేరాయని, బంగారం ధరలు పెరగడం కూడా సవాలుగా మారిందని చెప్పారు. బయటి సంక్షోభాలను తట్టుకునేలా మోదీ నేతృత్వంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు.



