నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లో జూన్ నెల 20 వరకు జరిగిన రెవెన్యూ సదస్సుల్లో 16,739 దరఖాస్తులు స్వీకరించమని, దానికి గాను దరఖాస్తు చేసుకున్న వారందరి నోటిసులు అందజేయాలని నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ పేర్కొన్నారు. శనివారం ఇందల్ వాయి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా కార్యాలయం లో రెవెన్యూ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ డివిజన్ లో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేయడానికి ఆగస్టు 14 వరకు సమయం కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటికే అన్ని మండలాలను తిరుగుతూ ఇచ్చిన సమయంలో గ్రామంలోని ఫిల్డ్ విజిట్స్ చేసి వచ్చిన దరఖాస్తులపై విచారణ పూర్తి చేసి వివరాలు అందజేయాలని ఆదేశించినట్లు వివరించారు.
అనంతరం సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఇప్పటికే అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రక్రియ కొనసాగుతుందని ఇచ్చిన సమయానుసారం దరఖా స్తులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇందల్వాయి మండలంలోని అన్ని గ్రామాలలో కలిపి 3,486 దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎహెచ్పి సోహెల్, తహసీల్దార్ వెంకట్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్, సీనియర్ అసిస్టెంట్ గంగా ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ చరణ్, సర్వేయర్, రాజేందర్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.