ఎమ్మెల్యే ఐలయ్య హామీ నెరవేరింది
మున్సిపల్ చైర్ పర్సన్, బీజన బాలమణి భాస్కర్
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో రైల్వే గేట్ వద్ద పూర్తయిన అండర్పాస్ నిర్మాణ పనులతో పట్టణంలోని ప్రజలకు పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలకు ఎంతో ఊరట లభించిందని, మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. బుధవారం పూర్తయిన అండర్పాస్ నిర్మాణ పనులని ఆమె కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే, అప్పటి మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా, రైల్వే గేటు అవతల వైపు ఉన్న 1, 8, 9, 10, 11, 12 వార్డుల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ముఖ్యంగా విద్యార్థులు, రోగులు, వృద్ధులు, పెన్షన్ దారులు, వివిధ ప్రాంతాలకు బస్సుల కొరకు బస్టాండ్ పెళ్లి ప్రయాణించే ప్రయాణికులు, రాకపోకల్లో అనేక అవస్థలు పడ్డారని పేర్కొన్నారు.
పై ఆరు వార్డులలో మృతి చెందిన వారిని స్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అండర్పాస్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, గేటు అవతల ప్రాంత ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని కొనియాడారు. ఈ అండర్పాస్ అందుబాటులోకి రావడంతో ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు పట్టణ అభివృద్ధికి మరో మైలురాయిగా నిలిచిందన్నారు. ఆలేరు పట్టణ ప్రజల తరఫున ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియమ్మ మార్కు, పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్, మల్లెల సరిత శ్రీకాంత్, జట్ట నీరజా సిద్ధులు, కాంగ్రెస్ నాయకులు చిన్నం యాదగిరి శికిలం శ్రీను, వెంకట్ రెడ్డి, తాళ్లపల్లి మహేష్, ఆలేరు పట్టణ అఖిలపక్ష నాయకుడు బందెల సుభాష్ తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు.



