అమెరికాను వెనక్కి నెట్టిన బీజింగ్
శాన్ఫ్రాన్సిస్కో : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ల జాబితాలో అమెరికాను చైనా అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది. కంప్యూటింగ్ వ్యవస్థలలో స్వయం సమృద్ధిని సాధించాలన్న చైనా ఆకాంక్షకు ఈ పరిణామం అద్దం పడుతోంది. షెన్జెన్లో ఉన్న నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కేంద్రంలోని లైన్షైన్ సిస్టమ్ దేశీయంగా తయారు చేస్తున్న చిప్లను ఉపయోగిస్తోంది. ఈ కేంద్రం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి విడుదలయ్యే సూపర్ కంప్యూటర్ల ప్రపంచ ర్యాంకింగ్ ‘టాప500’లో మొదటి స్థానాన్ని గెలుచుకుంది. గత మూడు సంవత్సరాలలో చైనాకు ఈ ర్యాంక్ లభించడం ఇదే మొదటిసారి. అధునాతన కంప్యూటింగ్ రంగంలో అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనా పోటీ పడుతున్న సమయంలో ర్యాంకింగ్ ఫలితాలు వెలువడ్డాయి. అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో చైనా కంటే తన దేశాన్ని అగ్రభాగాన నిలిపే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్లో లైన్షైన్ వ్యవస్థ గతంలో మొదటి స్థానంలో ఉన్న ఎల్ కాపిటల్ను వెనక్కి నెట్టింది. ఎల్ కాపిటల్ అనేది లారెన్స్ లివర్మోర్ నేషనల్ లేబరేటరీలో ఉన్న ఓ సూపర్ కంప్యూటర్. దీనిని అమెరికా ప్రభుత్వం అణ్వాయుధాల నిల్వల అభివృద్ధికి, నిర్వహణకు ఉపయోగిస్తోంది. కాగా ఈ ర్యాకింగ్ ఆధారంగా… ఏఐ కోసం ఉద్దేశించిన అత్యంత వేగవంతమైన కంప్యూటర్ చైనా వద్ద ఉన్నదని అర్థం చేసుకోకూడదని నిపుణులు తెలిపారు. ఏఐకి సారూప్యంగా ఉండే కంప్యూటింగ్ పనిని చేయడానికి రూపొందించిన బెంచ్మార్క్ పరీక్షలో లైన్షైన్ నాలుగో స్థానంలో నిలిచింది. చిప్ డిజైనింగ్లో చైనా చేసిన కృషికి తాజా ర్యాంకింగ్ గుర్తింపు ఇచ్చింది. టాప500 జాబితాలో 2010లో చైనా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత 2023 వరకూ అమెరికా, జపాన్ దేశాలే ఆ స్థానాన్ని సాధిస్తూ వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత, అనంతరం జో బైడెన్ హయాంలో చిప్- కంప్యూటింగ్ సంబంధిత ఎగుమతి ఆంక్షలు విధించడంతో 2023లో చైనా తన వ్యవస్థల వివరాలను సమర్పించడం నిలిపివేసింది.
సూపర్ కంప్యూటర్ల జాబితాలో చైనాకు అగ్రస్థానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



