నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో అనుమతి లేకుండా మందులు నిల్వ చేసి, పంపిణీ చేశారన్న ఆరోపణలపై గౌతమ్ గంభీర్ ఫౌండేషన్పై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. గంభీర్ ఫౌండేషన్, గంభీర్, అతడి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ.. ఈ కేసులో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లను, క్రిమినల్ ఫిర్యాదును కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో, ఫౌండేషన్ ద్వారా అధీకృత డీలర్ల నుంచే మందులు కొనుగోలు చేసి, మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజలకు ఉచితంగా అందించామని పిటిషనర్లు వాదించారు. ఇది పూర్తిగా సేవా కార్యక్రమమని, ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేదని కోర్టుకు విన్నవించారు. అయితే, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ విచారణ ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఫౌండేషన్ లైసెన్సులు లేకుండా ఫావిపిరవిర్ (ఫాబిఫ్లూ) వంటి కోవిడ్ మందులను నిల్వ చేసిందని, ఇది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. దీంతో కింది కోర్టు గంభీర్తో పాటు అతడి కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేసింది. తాజా తీర్పుతో, ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్, ఇమ్రాన్ హుస్సేన్లకు కూడా ఊరట లభించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.



