– బాటిల్నెక్ సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభం
– ఇరువైపులా స్థలం ఇచ్చేందుకు ఐఐసిటి సానుకూలత
– మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తి స్థాయి విస్తరణకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ – నాచారం
నాచారం ప్రధాన రహదారిపై హబ్సిగూడ నుంచి నాచారం వైపు వెళ్లే మార్గంలో ఉన్న ఐఐసిటి ఇన్స్టిట్యూట్, ఐఐసిటి క్వార్టర్స్ మధ్య ఏర్పడిన బాటిల్నెక్ సమస్య పరిష్కారానికి కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ సమస్యపై గత కొంతకాలంగా నిరంతరంగా కృషి చేస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రయత్నాల ఫలితంగా రోడ్డు విస్తరణకు మార్గం సుగమమవుతోంది. ఈ మేరకు ఐఐసిటి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో ఎమ్మెల్యే సమావేశమై రహదారి విస్తరణ అంశంపై చర్చించారు.
ప్రస్తుతం ఉన్న రహదారికి ఇరువైపులా సుమారు 20 అడుగుల చొప్పున స్థలం ఇవ్వడానికి సంస్థ సానుకూలంగా ఉన్నట్లు డైరెక్టర్ తెలిపారు. అయితే, భవిష్యత్లో పెరుగుతున్న జనాభా, విద్యాసంస్థల వాహనాల రద్దీ, చర్లపల్లి రైల్వే స్టేషన్ కారణంగా ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున, మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా పూర్తి స్థాయి రోడ్డు విస్తరణ చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. రహదారి మధ్య నుంచి తగిన వెడల్పుతో విస్తరణ చేపడితే దీర్ఘకాలికంగా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర కార్యాలయానికి నివేదిక పంపించి తదుపరి చర్యలు చేపడతామని ఐఐసిటి డైరెక్టర్ హామీ ఇచ్చారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించి, నాచారం–హబ్సిగూడ మార్గాన్ని ట్రాఫిక్ రహితంగా మార్చేందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి కొనసాగుతోందని స్థానికులు పేర్కొన్నారు.



