ప్రతి ఒక్కరిపైనా నిఘా
అదనపు బలగాల మోహరింపు
పోలీసులకు సహకరించాలన్న సీపీ బి.సుమతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ 13వ రాష్ర్టావతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మూడు కమిషనరేట్ల పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. సికింద్రాబాద్లోని పేరేడ్ గ్రౌండ్స్లో ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో గవర్నర్, ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, వీఐపీలు, వీవీ ఐపీలు, ప్రముఖులతోపాటు నగరవాసులు పాల్గొంటున్నారు. దాంతో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారు 1140 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సివిల్ విభాగం నుంచి 507, ట్రాఫిక్ విభాగం నుంచి 358, సీఎస్డబ్ల్యు, ఏఆర్, టీజీఎస్పీతోపాటు అదనపు బలగాలను మోహరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ముగ్గురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తారని మల్కాజ్గిరి సీపీ బి.సుమతి తెలిపారు. 49 మంది సీఐలు, 88 సబ్ఇన్స్పెక్టర్లు, 723 మంది పోలీస్ సిబ్బందితోపాటు ఎస్వోటీ, అక్టోపస్ బృందాలు, ఎస్బీ, ఐటీ సెల్ బృందాలు పనిచేస్తామని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ బృందాలను రంగంలోకి దించామన్నారు. డాగ్స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ను ఉపయోగిస్తున్నామని తెలిపారు. మారుణాయుధాలు, ప్రమాదాలకు అస్కారం కల్గిన వాటిని లోనికి అనుమతించబోమన్నారు. ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంటుందని, అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉదయం 7గంటల నుంచి 12గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, నగర వాసులు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు. పాసులున్న వారు పోలీసులు సూచించిన విధంగా పార్కింగ్ ఏరియాలో వాహనాలను పార్క్ చేసి లోనికి వెళ్లాలని కోరారు. అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.



