ఏడాదిలో లక్ష ఇండ్లకు గృహప్రవేశాలు చేసుకున్నాం
గుడిసెలు లేని గూడేలే లక్ష్యం
ఐటీడీఏ ప్రాంతాల్లో
అదనంగా 21 వేల ఇండ్లు
సెప్టెంబర్ 17న మరో
లక్ష ఇండ్ల గృహప్రవేశం
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో పైలాన్ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం
నవతెలంగాణ- కాగజ్నగర్/ఆసిఫాబాద్
”ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో ముందుకు నడిపించాలన్నదే మా ప్రయత్నం. ఇక్కడ గిరిజన, ఆదివాసీ బిడ్డలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయాలనేదే మా ఆలోచన. పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వాలని అడవి బిడ్డలు వచ్చి నన్ను కోరారు. వెంటనే నియోజకవర్గానికి 3500 ఇండ్లతో పాటు ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా 21 వేల ఇండ్లు మంజూరు చేశాం. గుడిసెలు లేని ఆదిలాబాద్ జిల్లాను నేను చూడదలచుకున్నా. ఇండ్లు లేని వారి లిస్టు తయారు చేసి మాకు ఇవ్వండి. ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి గిరిజన గూడేల్లో ఇండ్లు మంజూరు చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాలోని గూడేల్లో ఒక్క గుడిసె కూడా కనిపించొద్దు.. గూడేల్లో అవసరమైన ఇండ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా. ఇందిరమ్మ బిల్లుల విడుదలలో ఒక్క రోజు కూడా జాప్యం చేయలేదు. ఏడాదిలో లక్ష ఇందిరమ్మ ఇండ్లకు గృహ ప్రవేశాలు చేసుకున్నాం. 2026 సెప్టెంబరు 17న మరో లక్ష ఇండ్లకు గృహ ప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆదేశిస్తున్నా. రెండో విడతలో భాగంగా మరో 2.50 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం” అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో సోమవారం ప్రజా పాలన- ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు కొఠారి గ్రామంలో పైలాన్ను ఆవిష్కరించి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధి కారులు, లబ్దిదారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాలు చేపట్టారు.
అనంతరం జరిగిన సభలో రేవంత్రెడ్డి మాట్లా డుతూ.. తమ ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆదిలాబాద్కు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడిగా ఆనాడే చెప్పానని, ఆదివాసీ గూడేలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తమ ప్రభుత్వం భావించిందని అన్నారు. రాష్ట్రంలో మంజూరు చేసిన 4.50 లక్షల ఇండ్లతోపాటు గూడేల కోసం అదనంగా ఇండ్లు మంజూరు చేశామన్నారు. గూడేల కోసం ప్రత్యేకంగా 21 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, ఈ ఏడాదిలో రాష్ట్రంలో లక్ష మంది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నామని అన్నారు. వచ్చే ఏడాది ఇదే తారీఖున అన్ని గూడేల్లో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిం చుకుని పండుగ చేసుకుందామన్నారు. గూడేల్లో ఇండ్లు లేని పేదలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని మంత్రి పొంగులేటికి సూచిస్తున్నామని తెలిపారు. పాత ఇందిరమ్మ ఇండ్లకు గోడలు బాగున్నా పైకప్పు పాడై కొందరు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి స్లాబ్ వేసు కునేందుకు అదనంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ సభకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అధ్యక్షత వహించారు.
రూ.112.14 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి ముందుగా రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టుతోపాటు ఆసిఫాబాద్లో మున్సిపల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కౌటాలలో కెవి సబ్ స్టేషన్ను ప్రారంభించారు. చింతలమనేపల్లి, గుడ్లబోరి, సిర్పూర్ కాగజ్ నగర్ లోని కాపువాడలో, సిర్పూర్(టి) మండలం చింతకుంటలో, కాగజ్నగర్ మండలం అంకుషాపూర్లో కెవి సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. రెబ్బెన మండలం నంబాల గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో, కాగజ్నగర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.



