నవతెలంగాణ – హైదరాబాద్ : పూణె అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత వాయుసేనకు చెందిన ఒక విమానానికి ప్రమాదం జరగడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన కారణంగా రన్వేను తాత్కాలికంగా మూసివేయగా, వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, మరమ్మతుల అనంతరం రన్వేను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, శుక్రవారం రాత్రి సుమారు 10:25 గంటలకు రొటీన్ నైట్ ఫ్లయింగ్ సోర్టీలో భాగంగా ఒక ఫైటర్ జెట్ ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం హార్డ్ ల్యాండింగ్ కావడంతో దాని అండర్క్యారేజ్ విఫలమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ఘటనతో రన్వే బ్లాక్ కావడంతో విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేశారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, పౌర ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని భారత వాయుసేన ఒక ప్రకటనలో తెలిపింది. రన్వేను క్లియర్ చేసి, సాధారణ కార్యకలాపాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించింది. రాత్రంతా శ్రమించి విమానాన్ని తొలగించి, భద్రతా తనిఖీల అనంతరం రన్వేను తిరిగి కార్యాచరణలోకి తెచ్చినట్లు ఐఏఎఫ్ తరువాత ప్రకటించింది.



